Friday 7 March 2014

Vidura


మనం ఏమి పని చేసినను, ధ్యానం అవనివ్వండి, మంత్ర జపం, పూజ, దాన ధర్మాలు లేదా పేరు ప్రతిష్టలు కొరకు చేసే పని అవ్వనీయండి, దానిని పరమాత్మకు అర్పించనిదే దాని ఫలం మనకు దక్కదు. ఒక్క సారి దానిని పరమాత్మకు అర్పించిన తరువాత దానిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే (ఉనికి వలన కాని , క్రియ వలన కాని, భావన వల్ల గాని) అది తనంతటే అదే తొలగిపోతుంది. ఎలాగైతే, చిరిగిన పది రూపాయల నోటును మనం బ్యాంకుకు తీసుకువెళితే దాని బదులుగా క్రొత్త, నిగనిగలాడుతున్న పది రూపాయల నోటు మనకొస్తుంది అలానే. అట్లనే, మనం మన కర్మలను పరమత్మకు అర్పిస్తే, ఆన్ని తప్పులు తొలగి పోతాయి. మహాభారతంలో ఒక కథ దీనిని ఉద్ఘాటిస్తున్నది.
          శ్రీకృష్ణులవారు హస్తినాపురమునకు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఆయనను తోడ్కొని రావటానికి మంగళ వాయిద్యాలతో ఊరి జనాలందరిని పంపాడు. ఇద్దరే ఇద్దరు పరమాత్మను తోడ్కొని రావటానికి వెళ్ళలేదు. వారు పుట్టి గ్రుడ్డియైన దృతరాష్ట్రుడు మరియు మనోవైకల్యం కలిగినటువంటి దుర్యోధనుడు. కృష్ణుడు భీష్ముల వారిని, కృపాచార్యులవారిని, ద్రోణాచార్యులను చూసారు, అట్లానే యోజనాల యోజనాల మేర గుమికూడిన నగర ప్రజలను వీక్షించారు. ఊరంతా జన సముద్రంతో నిండి రధం ముందుకు వెళ్ళడానికి దారే లేదు. అందువల్ల కృష్ణుడు రథం దిగి భీష్ముడు, ద్రోణుని తోడై నగర ప్రవేశం చేస్తారు.
          ఆ విధంగా వారు నగరంలోకి ప్రవేశించారు. అక్కడ అత్భుతమైన కట్టడాలను చూసి కృష్ణుడు ఇది ఎవరి మహళ్ అని అడుగగా భీష్ముల వారు ఇది నాది, ఇది నాది అని అన్నారు. అలా ప్రతీ మహళ్ దగ్గర ఆగి ఇది ఎవరిది?  ఇది ఎవరిది? అని అడుగగా ఇప్పుడు ద్రోణాచార్యులు ఇది నాది. ఓ ప్రభూ! మీరిక్కడ బసచేయాలని విన్నవించాడు ద్రోణుడు.
          అప్పుడు కృష్ణుడు నాకు ఇక్కడ బస చేయడానికి సమయం లేదు, తీరిక లేకుండా ఉన్నాను అంటాడు. ఈ విధంగా అందరూ ఈ మహళ్ నాది, ఈ మహళ్ నాది అని కృష్ణున్ని ఆహ్వానిస్తారు, కాని కృష్ణుడు దీనినంతటిని నిరాకరిస్తాడు.
          ఆ తరువాత, అందరూ దుర్యోధనుని మహళ్ సమీపమునకు వెళతారు. దుర్యోధనుడు కృష్ణున్ని చూసి  ఏమిటి విషయం? ఎప్పుడు వచ్చావు? అని గొణిగాడు. ఆ సంగతి వదిలిపెట్టు, ఇది ఎవరి మహళ్? అని అడుగుతాడు. దుర్యోధనుడు ఈ మహళ్‍ను గుర్తించలేదా? ఇంతకు మునుపు నువ్వు వచ్చి ఉన్నావు. ఇది నా మహళ్ అని అహంకారంతో చాటాడు.
        ఇంతకు మునుపు నేను వచ్చియున్నాను, కాని, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అంటాడు కృష్ణుడు. అవును, నేను ఈ భవనాన్ని చాలా గొప్పగా మరల నిర్మించాను నువ్వు వచ్చి చూడాలని కోరుతాడు దుర్యోధనుడు. క్షమించు, నాకు సమయం లేదంటాడు కృష్ణుడు. నా మహళ్ కన్నా ఖరీదైనది వేరొక భవనం లేదు. మరి కృష్ణుడు ఎక్కడికి పెళతాడు? అని ఆశ్చర్యపోవడం దుర్యోధనుని వంతైంది.
          దుర్యోధనుడు చూస్తుండగానే, కృష్ణుడు తన బృందంతో ముందుకు సాగిపోయాడు.
          ఆయనకు రహదారిని ఆనుకొని ఒక పాడు బడిన, పగిలిన గోడలు, పై కప్పు సరిగ్గా లేని ఒక గుడిశ కనిపించింది. నివాసం కోసం ఆ గుడిశ ముందు ఆగి, అందరిని చూస్తూ ఇదెవ్వరి గృహం? అని అడిగాడు. ఎవరూ సమాధానమివ్వలేదు. మరల మరల ప్రశ్నించాడు కృష్ణుడు. గుంపు వెనుక, నీరోడుతున్న నయనములతో విదురుడు కృష్ణుడి చేతిలో చేయివేసుకొని, కూడ తిరుగడానికి నేనేమైనా గొప్ప బ్రహ్మణుడినా? లేకా క్షత్రియుడినా? నేను ఒక సాధారణ సేవకుని కుమారుడను. ప్రభువు ఎలా నాతో మాట్లాడతాడు? అని మనస్సులో వాపోతాడు విదురుడు.
          అప్పుడే కృష్ణుడు మరల ఇది ఎవరి గృహం? అని అడుగగా, తన అదృష్టాన్ని నమ్మలేక విదురుడు కృష్ణుని పాదాలపై పడి గోపాలా! ఇది నీ గృహమే అని అంటాడు.
          కృష్ణుడు మహా ఆనందంతో నా తల్లి యశోద హస్తినాపురం‍లో ఒక ఇల్లు నా కోసం కట్టినట్లు నాకు తెలియదు అని అంటాడు. అలా అని, భగవాన్ ఆ గుడిశలోకి ప్రవేశిస్తాడు. అందరూ ఆశ్చర్యంతో, రాజుల, మంత్రుల భవంతులను కాదని కృష్ణుడేమిటి ఈ గుడిశలో ప్రవేశించాడు? అని అనుకుంటారు. ఎందుచేతనంటే  విదురుడొక్కడే ఆ భగవంతుని శరణాగతిలో ఉన్నాడు’. అతని ఇల్లు గోపాలుడిదే, అతడు తినే ఆహారం కృష్ణుడికి అర్పించినదే, అతను ధరించిన వస్త్రములు భగవంతుని ఆశీర్వాదమే!
           పాడుబడిన గుడిశ లోపల విదురుడు తన అదృష్టాన్ని నమ్మలేకున్నాడు. ప్రతి రోజు కృష్ణుడి విగ్రహమునకు పూజ చేస్తున్నాడు కాని, ఈ రోజు కృష్ణుడే వచ్చాడు. విదురుడు ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. విదురుడు పరుగుతో వెళ్ళి కొన్ని పుష్పములు, పత్రములు, పాలు మరియు సుగంధ భరితమైన నీళ్ళు తెచ్చి కృష్ణుని పాదాలకు అర్పించక, తన నెత్తిపై పోసుకుంటాడు. విదురునకు మహానందంలో తానేం చేస్తున్నాడో కూడా తెలియటం లేదు. అది ఒక గొప్పింటి వివాహంలో ఒక అనుభవరహితుడైన పండితుడు పెళ్ళి కూతురి తల్లికి హారతి ఇవ్వమని పురమాయీంచినట్లున్నది. కుమార్తె వివాహం జరుగుతున్నదన్న ఆ గొప్ప ఆనందంలో ఆ తల్లి మతి మరుపు వలన ఇడ్లి పిండిని నూనెకు బదులుగా ఆ దీపంలో పోస్తుంది! అలా అమితమైన ఆనందంలో విదురుడు తన నుదిటిపై గంధం వ్రాసుకొని, నెత్తిన పాలతో అభిషేకం చేసుకుంటూ పూజను నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ఆగదని గ్రహించి, కృష్ణుడు ముసిముసి నవ్వులతో, విదురా, నేను భరించలేని ఆకలితో ఉన్నాను. ఆహారం తీసుకున్న తరువాత పూజ కానిద్దాం అని అంటాడు.
          విదురుడు తన కలలో కూడా ఎప్పుడూను కృష్ణుడు తనింట భోజనానికి వస్తాడని అనుకోలేదు. ఏమి చేయాలో తెలియక, విదురుడు ఆనందంలో నృత్యం చేస్తూ గెంతుతూ నేలమీద పడి దొర్ల సాగాడు.
          విదురా! నీవు నీ కోసం వండుకున్న బోజనాన్నే నాకు పెట్టాలని మాటివ్వాలంటాడు కృష్ణుడు.
          మంత్రి అయినప్పటికీ విదురుడు, రోజుకు ఒకటో రెండో రూపాయలే సంపాదించేవాడు. అతడు అత్యాశ్చర్యానికి లోనౌతాడు. కృష్ణుడికి మృష్టాన్నం పెట్టాలని కోరిక, కాని తాను రోజు తీసుకునే గంజి తనకూ ఇవ్వమని కృష్ణుడు కోరుతున్నాడు.
          విదురుని వద్ద ఒక మంచి గిన్నె కూడా లేదు. వెంటనే ఒక అరటి ఆకుతో దొన్నె తయారు చేసి దానిలో గోరువెచ్చని గంజిని ఒక పాత గుడ్డతో కప్పి తీసుకువస్తాడు.
         తెరవమని కృష్ణుడంటాడు. తెరువనంటాడు విదురుడు. దేవాది దేవుడు తనను కలవడానికి వచ్చినప్పుడు అందరూ చూడలేని, మూతవేసి తేచ్చే ఆహారాన్ని ఇస్తున్నందుకు నేను మిక్కిలి పాపిని అని భావిస్తాడు. తానిస్తున్న ఆహారం ఏ ఆహారం తీసుకోలేని రోగికి ఇచ్చేదిగా భావిస్తాడు.
          ఈ విధంగా దుఃఖిస్తుండగానే, కృష్ణుడు ఆ పాత్రలోని గంజిని గొప్ప సంతోషంతో ఆరగిస్తాడు. పరమాత్మ అనుకుంటాడు ఎక్కడో నా భక్తులు నన్ను తలచుకోగానే అన్ని దుఖములను తొలగిస్తానే, మరిక్కిడ నన్ను ఎదురుగా పెట్టుకొని, దుఃఖంతో మునిగి వున్నాడు విదురుడు. ఇటువంటి అన్యాయం వైకుంఠాన్నే నాశనం చేస్తుంది అని భావిస్తాడు.
          విదురుణ్ణి ఓదార్చే ఉద్దేశంతో, పరమాత్మ ప్రేమగా విదురా అని పిలవగా విదురుని దుఃఖం పోయి, కన్నులు ఆనందభాష్పాలతో నిండింది.
         నేను ఈ ఎండలో నడిచి నడిచి అలసిపోయా. నేను గంజి అడుగుదామనుకుంటున్నను. నేను గంజి అడుగుతానని నీకెలా తెలుసు? అని కృష్ణుడు అడుగుతాడు.
          కృష్ణుడికి ఇష్టమని తెలిసి, విదురుడు అమితానందానికి లోనై, అరటి పళ్ళు తెచ్చి ఒక్కొక్కటి వలిచి పండు క్రింద పడేసి, తొక్కలు ఇవ్వడం మొదలు పెట్టాడు. కృష్ణుడు ఆ తొక్కలని ఆగరించి, ఏ కొండవాలున ఇంతటి స్వాదైన అరటి పండు తొక్కలు పండుతున్నయని ఆశ్చర్యపోతాడు.
          చివరిగా, కృష్ణుణ్ని ప్రదక్షిణం చేసి, అనుగ్రహం పొందుతుండగా గుంపుగా ఉన్న అరటి పళ్ళ  ను చూసి , గొప్ప దుఃఖంతో తానేం చేస్తున్నాడో తలచుకొని మరల బోరున ఏడ్వడం మొదలు పేట్టాడు విదురుడు.
          వెంటనే కృష్ణుడు, ప్రియమైన విదురా! నీ భక్తి వలన ఈ అరటిపండు తొక్కలు అరటిపండ్ల కంటే మరింత రుచిగా మారాయి అని అంటాడు.
          ఆ రోజంతా కృష్ణుడు విదురుని తొడలపై కాలును మ్రోపి విశ్రమిస్తాడు. ఆ తరువాతనే దుర్యోధనుణ్ని, కర్ణుణ్ని కలవడానికి బయలు దేరుతాడు.
          ఇక్కడ మనకు విదురుడు ఎలాగైతే పరమత్మ శరణాగతి పొంది, తన లోపాలను తొలగించుకుంటాడో తెలుస్తున్నది. పరమత్మకు సేవ చేయడం వలన మన ఘోర తప్పిదాలు, మాలిన్యాలు ఏ విధంగా తొలగించుకోగలమో తెలుస్తున్నది. అందువలననే, మనం అన్ని కార్యాలను (పూజలను) కాయేన వాచా మనస్సేంద్రియైవా, భుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్, కరోమి యద్యత్ సకలం పరస్మై, నారాయణాయేతి సమర్పయామి తో ముగిస్తాము మనం. ఇలా ఉచ్చరిస్తున్నప్పుడు, మనకు దానర్థం తెలియనక్కర లేదు. ఎందుచేతనంటే, భగవంతునికి దానర్థం తెలుసు.
          బ్రాహ్మణ కుమారులు భవతి భిక్షాం దేహి... అని గడపలో నుంచొని అర్థిస్తే, గృహస్తుడు దానర్థం తెలియకనే, వారికి భిక్ష ఇస్తాడు. మరి ఒక సాధారణ గృహస్థురాలు దానర్థం గ్రహించక భిక్ష ఇవ్వగా లేనిది, పరమాత్మ మన ప్రార్థనను గుర్తించలేడా? అతను తెలుసుకొని, వెంటనే మనకు కావలసినది ప్రసాదిస్తాడు. తెల్లవాడో- నల్లవాడో; వేటగాడో-పురోహితుడో;  బ్రాహ్మణుడో-శూద్రుడో; పొడవువాడో-పొట్టివాడో; గ్రుడ్డివాడో- అవిటివాడో; పుణ్యాత్ముడో- పాపాత్ముడో అని చూడక అందరిని ఆదుకొనే ఆ భగవంతునికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
(ఇది తపోవన్ ప్రసాద్: ఆగస్టు నెలలో ప్రచురితమైన శ్రీ అనంతరామ దీక్షితార్ గారి ఆంగ్ల మూలం విదుర నుండి తర్జుమా చేయబడింది)


No comments:

Post a Comment